1989 కాంగ్రెస్, 2024 చంద్రబాబు గెలుపునకు కాపులే కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రేపల్లెలో జరిగిన కాపు కార్తీక సమారాధన సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “1989లో వంగవీటి రంగా హత్య తర్వాత కాపులు కాంగ్రెస్ను గెలిపించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసింది కూడా కాపులే. కాపులు సీఎం అయినా కాకపోయినా ముఖ్యమంత్రి ఎవరు కావాలో కాపులే అప్పుడప్పుడు నిర్ణయిస్తారు” అని అన్నారు. “వచ్చే ఎన్నికల్లో రేపల్లెలో కాపు అభ్యర్థి పోటీలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం రేపల్లెకు రావడం లేదు. కృష్ణా తీరంలో జరిగిన కాపునాడు మహానాడును మించిపోయింది. దేశమంతా గుర్తించింది” అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంగవీటి రంగా కుమార్తె ఆషా కిరణ్తో పాటు వివిధ పార్టీల కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

