కోర్టు ధిక్కరణ పిటిషన్ మేరకు తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు హైకోర్టు పిటిషన్ నోటీసులు జారీ చేసింది. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీల్లో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని నారాయణపేటకు చెందిన వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖలకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్ను కోరింది. పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జనవరి 27వ తేదీన హైకోర్టు విచారణ ముగించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ప్రభుత్వం పై పిటిషనర్ పలు పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి సీఎస్కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.