తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల మూడో వారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలో జరగకపోతే బడ్జెట్ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే చేపట్టే అవకాశాలున్నాయి.
మరోవైపు మంత్రి పదవుల కోసం పార్టీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుంది. నలుగురు లేదా ఐదుగురికి విస్తరణలో అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసే అవకాశం ఉంది.