ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బీహార్లోని కేసరియాలో కొలువుదీరింది. విరాట్ రామాయణ మందిర్లో 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ శివలింగం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగంగా గుర్తింపు పొందింది. ఈ భారీ శివలింగాన్ని తమిళనాడులో దాదాపు పదేళ్ల పాటు ప్రత్యేకంగా తయారు చేశారు. మహాబలిపురం నుంచి బీహార్ వరకు వేల కిలోమీటర్ల దూరాన్ని దాటి 96 చక్రాల భారీ ట్రక్కు ద్వారా 45 రోజుల్లో కేసరియాకు తరలించారు. ప్రతిష్టాపన అనంతరం నేల నుంచి శివలింగం మొత్తం ఎత్తు 56 అడుగులుగా ఉంటుంది. ఈ శివలింగానికి సహస్రలింగం అనే పేరు ఉంది. అంటే ఒకే శివలింగంలో 1008 చిన్న శివలింగాలు చెక్కి తయారు చేశారు. నల్ల గ్రానైట్ రాయితో రూపొందించిన ఈ శివలింగం నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల ఖర్చు అయ్యింది. ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. 21 మంది పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాన్ని 17 అడుగుల పొడవైన మాలతో అలంకరించారు. పూలు, మారేడు ఆకులు, ఉమ్మెత్తతో చేసిన సుమారు 20 కిలోల పూలమాలను శివలింగానికి సమర్పించారు. ఆలయాన్ని అలంకరించడానికి దాదాపు 3,250 కిలోల పూలను ఉపయోగించారు. ఈ పూలను కోల్కతా, కంబోడియా నుంచి తెప్పించినట్లు తెలిపారు. సహస్రలింగం శివలింగంతో పాటు విరాట్ రామాయణ మందిర్లో 1,072 దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు.

