చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇచ్చి అప్లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలు వినియోగించుకోవాలని తెలిపింది. పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించిన సంగతి తెలిసిందే.