గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో హింసాత్మక అల్లర్లు, విద్యార్థి ఉద్యమంతో ప్రధాని పదవి వదులుకుని భారత్కు పారిపోయిన షేక్ హసీనా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహ్మద్ యూనస్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్కు రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, దీనిపై తాను ఆందోళన చెందుతున్నానని వెల్లడించారు. హసీనా పాలనలో మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుగుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, కోర్టులు ఆమెపై అనేక కేసులు నమోదు చేశాయి. ప్రత్యేక ట్రిబ్యునల్ 29 మంది అవామీ లీగ్ నేతలతో పాటు హసీనాపై కూడా కేసు పెట్టి, అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. భారత్ ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలా అనే ప్రశ్నకు యూనస్ స్పందిస్తూ, “భారత్కు ఇష్టమైతే ఆమెను ఉంచుకోవచ్చు, కానీ చట్టపరమైన బాధ్యతలు ఉంటే పరిస్థితి మారుతుంది” అని చెప్పారు. భారత్ హసీనాకు మద్దతు ఇస్తూనే ఉందని, ఆమె వెనుక ఉన్నవారు ఆమెను విజయవంతమైన నాయకురాలిగా తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారని యూనస్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.