వైసీపీ అధినేత వైయస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్విప్,వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడి విషయంలో తాము చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటూ హోంమంత్రి, పోలీసు సంఘాలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న వైయస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తోందన్నారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడి హత్యతో ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వైయస్ జగన్ రెండు రోజుల ముందుగానే ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లారన్నారు. అక్కడ ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కనీసం పదిమంది పోలీసులు కూడా భద్రతలో లేరని మండిపడ్డారు.పోలీసుల భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దీన్ని వక్రీకరించేలా హోంమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపులపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.