సామాజిక న్యాయ యోధుడు, మహిళా విద్యా ద్వారాలు తెరిచిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. “మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు. తన సతీమణి సావిత్రిబాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు” అంటూ వైఎస్ జగన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. మహాత్మా పూలే దంపతులు స్త్రీ విద్యకు, దళిత, బహుజనోద్ధరణకు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు.

