భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలు ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, భారత్ అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందన్నారు. భారత్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ, అమెరికా ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు తీవ్రంగా తగ్గాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్పై విధించిన 50 శాతం సుంకాలను పూర్తిగా సమర్థిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. భారత్తో వాణిజ్యం చాలా ఏకపక్షంగా కొనసాగిందని ట్రంప్ విమర్శించారు. హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం విధించడం ఉదాహరణగా ప్రస్తావించారు. భారత్ అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేస్తోంది కానీ, అమెరికా ఉత్పత్తులపై అడ్డంకులు పెడుతోందని ఆరోపించారు. భారత్ నుంచి వచ్చే వస్తువులు అమెరికాలో తయారు కాకపోవడం వల్లే అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. భారత్పై విధించిన 25 శాతం సుంకాలు రష్యా సంబంధాల కారణంగా మరో 25 శాతం పెంచి మొత్తంగా 50 శాతం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల చర్చలు జరిగాయని, మరో రౌండ్ చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే, కొత్త తేదీలు ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య సమతుల్య వాణిజ్య సంబంధాలు అవసరమని, ఇరువురి ప్రయోజనాలకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది.