తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే ఇకపై 10 నుంచి 20 శాతం వరకు భారీ డిస్కౌంట్ లభించనుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం తీసుకున్న ఈవీ పాలసీలో భాగంగా ఈ మంచి నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 10-20% డిస్కౌంట్ ప్రకటన
మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తదితర ప్రముఖ ఈవీ కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా జరిగాయి. ఉద్యోగులు ఈ డిస్కౌంట్ ద్వారా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లు, బైకులు కొనుగోలు చేయవచ్చు.
ఈవీ పాలసీలో రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ 100% మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహించడం కోసం రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా రద్దు చేసింది. ఇప్పటి వరకు లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు 925.94 కోట్ల రూపాయలు రాయితీలుగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా ఎక్కువ మంది ఈవీల వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈవీ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది
ఈవీ పాలసీ అమలు చేసిన తర్వాత తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 0.60 శాతం నుంచి 1.50 శాతానికి పెరిగింది. ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యలు సక్సెస్ అవుతున్నట్లు సూచిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సుస్థిర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించాలని స్పష్టం చేశారు.

