పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఉభయసభల్లో చేసిన ప్రసంగం దేశీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ ప్రసంగంలో ఆయన ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారత విదేశాంగ విధాన దృక్పథాన్ని వివరించగా, ‘కొవిడ్’ మహమ్మారి ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, చర్చల ద్వారానే సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు, భారతీయుల భద్రత అత్యంత ప్రాధాన్యంగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా, అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటుందని, ఏ దేశానికీ వశం కాకుండా తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న సంక్షోభాల మధ్య భారత్ సమతుల్య వైఖరిని పాటిస్తోందని ఆయన వివరించారు.

