ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) మృతి చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయన ఇప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ, గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్య లేకుండానే కవిత్వంలో రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో ప్రజాదరణ పొందారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి పురస్కారం అందజేసింది. అందెశ్రీ ఆకస్మిక మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం రచయిత మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ గీతం కోట్లాది మంది ప్రజల గొంతుకగా నిలిచిందని తెలిపారు. తనతో అందెశ్రీకి ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపొందించామని చెప్పారు. తెలంగాణ సాహిత్య శిఖరం కూలిపోయిందని సంతాపం ప్రకటించారు.

