తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ కారు కేసులో ఏసీబీ విచారణకు వెళ్లిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుదిరిగారు. విచారణకు తన తరఫు లాయర్లను అనుమతించకపోవడంతో కేటీఆర్ వెళ్లిపోయారు. తన అడ్వకేట్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. లాయర్లు వస్తే ఇబ్బంది ఏంటని పోలీసులను కేటీఆర్ నిలదీశారు. అనంతరం తెలంగాణ భవన్కు వెళ్లారు.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను ఏసీబీ విచారణకు పిలిచి నా ఇంటిపై రెైడ్స్ చేయాలనేది వాళ్ల ప్లాన్. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టి.. ఇరికించాలని చూస్తున్నారు’ అంటూ ఏసీబీ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.