ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన వారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. కేవలం 7 రోజుల్లోనే 900 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. వీరిలో 55 మంది మైనర్లు ఉండటంతో వారిని కౌన్సెలింగ్కు హాజరుపరచగా, పెద్దవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కొంతమందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. గణేష్ మండపాల వద్ద, నిమజ్జనం ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన షీ టీం, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని గుర్తించి పట్టుకుంది. ఉత్సవాల్లో మహిళలను వేధిస్తే తప్పించుకోవచ్చని భావించిన పోకిరీలకు ఈ చర్యలు గట్టి హెచ్చరికగా మారాయి. షీ టీం ఇన్చార్జి లావణ్య మాట్లాడుతూ “మహిళలు, యువతులపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. నిమజ్జనం పూర్తయ్యే వరకు మా టీంలు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తాయి. మహిళలు ఎలాంటి భయం లేకుండా వెంటనే 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. ఉత్సవ వాతావరణంలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని పోలీసులు తెలిపారు. నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కఠిన చర్యల వల్ల పోకిరీలు వెనకడుగు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు.