ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ట్రాన్స్ జెండర్ రేఖ హైకోర్టును ఆశ్రయించారు. 2025 మెగా డీఎస్సీలో రేఖ 671 ర్యాంకు సాధించారు. ట్రాన్స్ జెండర్లకు పోస్టులు నోటిఫై చేయకపోవడంతో నియామక ప్రక్రియలో రేఖను పరిగణనలోకి తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు మొదట్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు మేము ఏమీ చేయలేమని పేర్కొంది. ట్రాన్స్ జెండర్ల హక్కులు సమాన అవకాశాల ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఈ ఆదేశాలతో ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు లభించే మార్గం సుగమమవుతుంది.

