రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి అమ్ముతున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అక్కడే ఫేక్ సర్టిఫికెట్లు అమ్మకం జరుగుతుండగా మిర్జా అక్తర్ అలీ బేగ్ (అలియాస్ అస్లాం), మహమ్మద్ అజాజ్ అహ్మద్, వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లతో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీలకు చెందిన ఫేక్ ధ్రువపత్రాలు కూడా గుర్తించారు. ఈ ముఠా కేవలం రూ.50 వేలకే పదో తరగతి, రూ.75 వేలకే ఇంటర్, రూ.1.20 లక్షలకే డిగ్రీ సర్టిఫికెట్లను అమ్ముతోంది. ఒరిజినల్లాగే కనిపించేలా అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను నార్సింగి పోలీస్ స్టేషన్కు అప్పగించగా, వారిపై కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

