బీజింగ్లో విక్టరీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, చైనా ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తుంది. ఈసారి 80వ వార్షికోత్సవం కావడంతో, వేడుకలు మరింత వైభవంగా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా జరిగాయి. తియానన్మెన్ స్వ్కేర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు 26 దేశాల నాయకులు హాజరయ్యారు. విశేషం ఏమిటంటే 66 ఏళ్లలో తొలిసారిగా ఉత్తర కొరియా నేత ఈ వేడుకలకు హాజరుకావడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సారి విక్టరీ డే ప్రధాన ఆకర్షణగా చైనా తొలిసారిగా తన అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. నాలుగో తరం యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు ఇవన్నీ దేశీయంగా తయారు చేశామని, ఇప్పటికే వినియోగంలో ఉన్నాయని చైనా సైనిక అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనతో ప్రపంచానికి తమ సాంకేతిక, సైనిక శక్తి స్థాయిని చూపించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించింది.