ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధాని అమరావతిలో చేపట్టనున్న రూ.2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, పలు భవనాలు, లే అవుట్ అనుమతులకు కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా మున్సిపల్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో ESI ఆసుపత్రిలో బెడ్స్ సంఖ్యను 100కు పెంచేందుకు అనుమతి లభించింది.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. త్వరలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కానుంది. ఈ క్రమంలోనే రేపు కర్ణాటక రవాణా మంత్రితో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్టు తెలిపిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే 500 పీబీజీ ప్లాంట్లకు కేబినెట్ ఓకే చెప్పింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.