ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 11న తొలి వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించినట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈనెల 11 నుంచి 13 వరకు శ్రీరామ మందిర వీఐపీ దర్శనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నట్లు తెలిపారు.
ఈనెల 11 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాల ప్రణాలికలను సిద్ధం చేశామని చంపత్ రాయ్ స్పష్టం చేశారు. 11న రామాలయంలో తొలి వార్షికోత్సవానికి సందర్భంగా నిర్వహించే ప్రతిష్ఠా ద్వాదశి కార్యక్రమాన్ని సీఎం యోగి ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామలల్ల అలంకారం, మహా అభిషేకం, మహా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం యోగి రామ్ లల్లా మహా హారతి నిర్వహించనున్నారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తి, కుమార్ విశ్వాస్ జనవరి 12 , 13 తేదీలలో తమ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.