మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యగా ఆరోపించారు. తిరుపతి విజివో డీఎస్పీ రాంకుమార్ సతీష్ను పలుమార్లు వేధించారని తెలిపారు. సీఐడీ విచారణలో అధికారులు అతన్ని భూతులు తిట్టి హింసించారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. సతీష్ తన సన్నిహితులతో సీఐడీ విచారణ తర్వాత బతకడం కంటే చనిపోవడం మంచిదని చెప్పాడని భూమన తెలిపారు. దీని బట్టి ఆత్మహత్య వెనుక ఒత్తిడి బెదిరింపులు స్పష్టమని ఆయన అన్నారు. సతీష్ను తన పేరు చెప్పించాలని పోలీసులు సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారని భూమన చెప్పారు. అధికారి నరసింహ కిషోర్ చెప్పినట్లు మాత్రమే చేశానని సతీష్ సీఐడీకి చెప్పాడు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పించాలని ఒత్తిడి తెచ్చి సతీష్ను మానసికంగా చంపేశారని ఆరోపించారు. సీఐడీ అధికారుల్లో లేని లక్షణరావు అనే న్యాయవాది విచారణలో పాల్గొని సతీష్ను భూతులు తిట్టి అవమానపరిచాడని భూమన అభ్యంతరం చూపారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ వేయగల ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని భూమన ప్రశ్నించారు. పోలీసుల మనోధైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని మంచి ఉద్యోగి ప్రభుత్వ కుట్రల బలి అయ్యాడని తెలిపారు. పరకామణి కేసులో హైకోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని భూమన విమర్శలు చేశారు.

